పొద్దంతా ఎండ.. మాపటేల మబ్బు
నిలకడ లేని వాతావరణం ఆక్వా రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వర్షాలతో మే నెల చల్లబడి పోగా.. అధిక ఉష్ణోగ్రతలతో జూన్ మొదలైంది.
కలిదిండి, మండవల్లి, న్యూస్టుడే: నిలకడ లేని వాతావరణం ఆక్వా రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వర్షాలతో మే నెల చల్లబడి పోగా.. అధిక ఉష్ణోగ్రతలతో జూన్ మొదలైంది. రాత్రి వర్షం.. పగలు ఎండలతో రొయ్యలను సతమతం చేస్తోంది. దీంతో చెరువుల్లో ప్రాణవాయువు సమస్య తలెత్తి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి.
పరిస్థితులు తట్టుకోవడానికి.. నాణ్యత కలిగిన రొయ్య పిల్లను ఎంపిక చేసుకోవాలి. నీటి లక్షణాలైన ఉదజని (పీహెచ్) సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నిత్యం ప్రాణవాయువు స్థాయిని సరిచూసుకోవాలి. క్షార స్వభావం (ఆల్కనిటీ), కాఠిన్యం (హార్డినెస్) ఉండాల్సిన స్థాయిలో ఉన్నాయో లేదో గమనించాలి. ప్రమాదకరమైన విష వాయువులు అమ్మోనియా నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి చెరువుల్లో తయారవకుండా సక్రమంగా ప్రోబయోటిక్స్ వాడుకుంటే వాతావరణంలో ఆకస్మిక మార్పులను రొయ్యలు కొంతమేర తట్టుకోగలుతాయి. భగ్గున ఎండ కాస్తూ ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి వర్షం పడినప్పుడు.. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఆకస్మికంగా ఉష్ణోగ్రత స్థాయి పెరిగిపోయినప్పుడు రొయ్యల ప్రాణ వాయువు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అమ్మోనియా స్థాయి పెరిగిపోయి చేపలు, రొయ్యలు ఒత్తిడికి లోనై చనిపోతాయి.
వాతావరణ మార్పులతో.. ఆకస్మికంగా వాతావరణంలో వస్తోన్న మార్పులతో ఏటా రెండు శాతం ఆక్వా పంట నష్టపోతుంది. దీని ప్రభావం వార్షిక ఉత్పత్తిపై, ఎగుమతులపై కూడా పడుతోంది. సుమారు రూ.360 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది.
ఇవి తప్పనిసరి.. నిరంతరం ఏరియేటర్లు తిప్పుతుండాలి. చెరువుల్లో మినరల్స్ను ఎక్కువగా వినియోగించకూడదు. వాతావరణం చల్లబడినప్పుడు రొయ్యల మేతను కొంతమేర తగ్గించుకోవాలి. అమ్మోనియా స్థాయి నిర్ధారణకు ప్రయోగశాలలో నీటి పరీక్షలు చేయించుకోవాలి. చెరువుల్లో వేసిన రొయ్య పిల్ల సాంద్రతను బట్టి పాక్షిక పట్టుబడి చేసుకోవాలి. దీనివల్ల మిగిలిన రొయ్యలు ఒత్తిడి లేకుండా పెరిగేందుకు వీలుంటుందని మత్స్యశాఖ ఏడీ రాజ్కుమార్ వివరించారు.