ఆక్వాకు వాతావరణ ముప్పు
గణపవరం: ఆక్వా రైతులు వేసవి పంటపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెరువులలో రొయ్య సీడ్ వేస్తే జూన్లో పట్టుబడికి సిద్ధమవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు ఎక్కువగా వేసవి సాగుపై గంపెడాశలు పెట్టుకుంటారు. ఈ వేసవి ఆక్వా రైతులకు చుక్కలు చూపిస్తుంది. వేసవి ఆరంభం నుంచి ఎండా, వానల సయ్యాటలతో ఆక్వా సాగు దినదినగండంగా సాగుతుంది. ఏప్రిల్ నెలలో సాగు సవ్యంగానే సాగినా మే నెలలో మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. వాతావరణంలో విపరీతమైన మార్పులతో వందల ఎకరాలలో సాగు అర్ధాంతరంగా ముగిసిపోయింది.
కౌంటు రాకుండానే మృత్యువాత
పూటకో రకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గండంగా మారింది. ఇరవై రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఒకే రోజులో విపరీతమైన ఎండలు ఒకపక్క, మరోపక్క ఉన్నట్టుండి ఆకాశం మేఘావృత్తమై వర్షాలు కురుస్తూ ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. గతంలో లేని విధంగా ఈ వేసవిలో సగం రోజులు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎండకాస్తే విపరీతమైన వేడి, ఉక్కబోతతో ఆక్వా సాగు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. పిల్ల వేసిన 30 రోజులలోపుగానే వాతావరణ మార్పులకు వైట్స్పాట్, విబ్రియో వంటి పలు వ్యాధులు వ్యాపించడంతో కౌంట్కు రాకుండానే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. రాత్రి వర్షం కురుస్తూ, పగలు ఎండలు కాయడంతో పీహెచ్ హెచ్చుతగ్గుల కారణంగా రొయ్యలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా మందులు చల్లడానికి చెరువుల వద్ద రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజిన్ల వినియోగానికి రోజూ వేలల్లో ఖర్చుపెడుతున్నారు.
ఆక్సిజన్ కోసం అవస్థలు
అప్పటికప్పుడు ఎండ మాయమై, మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోవడంతో ఆక్సిజన్ సమస్య తలెత్తి చేపలు, రొయ్యలు నీటి ఉపరితలంపై తిరుగాడుతున్నాయి. కొన్ని చోట్ల చనిపోయి నీటిపై తేలుతున్నాయి. ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు యుద్ధ ప్రాతిపదికన పట్టేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలలో రొయ్య, మరో 1.50లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఉంగుటూరు నియోజకవర్గంలోనే వారం రోజుల వ్యవధిలో దాదాపు 4 వేల ఎకరాల్లో కౌంట్కు రాకుండానే రొయ్యలు పట్టివేసినట్లు అంచనా. దీనికి తోడు రొయ్య ధర కూడా పదిరోజులలో కేజికి రూ.10 నుంచి రూ.15 మేర పడిపోవడంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు.
మత్స్యశాఖ అధికారుల సూచనలు
ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ నివారణకు పొటాషియం పర్మాంగనేటు సిద్ధంగా ఉంచుకుని, పీహెచ్ స్థాయిని బట్టి అవసరం మేరకు చెరువులో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినకపోతే పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో మేత, సేంద్రీయ ఎరువులు వేయడం పూర్తిగా మానేయాలి.