Andhra News: మన రొయ్యకు కొత్త మార్కెట్లేవి?
ఉత్పత్తి ఏదైనా సరే.. డిమాండు ఉంటేనే ధర పలుకుతుంది. రొయ్యలైనా అంతే..! ఎన్ని దేశాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటే అంత ఎక్కువగా ఎగుమతి చేయవచ్చు.
ఉత్పత్తి ఏదైనా సరే.. డిమాండు ఉంటేనే ధర పలుకుతుంది. రొయ్యలైనా అంతే..! ఎన్ని దేశాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటే అంత ఎక్కువగా ఎగుమతి చేయవచ్చు. ధరలూ లభిస్తాయి. ఎందుకంటే రొయ్య ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడిన పంట.. కానీ మన రాష్ట్ర ఉత్పత్తిదారులు మాత్రం అమెరికా, చైనా తదితర దేశాలపైనే అధికంగా ఆధారపడుతున్నారు. రొయ్యకు కొత్త మార్కెట్లపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, ఎంపెడా (సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) ఇన్నాళ్లూ దృష్టి సారించలేదు. ఫలితంగానే అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నా.. ఏపీ రైతులు నష్టపోతున్నారు. ఇటీవల రష్యాకు ఎగుమతులపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనితోపాటు మిగిలిన దేశాల నుంచి కూడా అనుమతులు తెచ్చుకుని ఎగుమతులకు డిమాండు పెంచాలని వ్యాపారులు సూచిస్తున్నారు.
ఎగుమతుల్లో రెండోస్థానం
దేశీయ ఎగుమతుల్లో.. సముద్ర ఉత్పత్తుల వాటా 1.69% మాత్రమే. ఉత్పత్తుల వారీగా చూస్తే 12వ స్థానం. రాష్ట్రానికి అక్వా ఎగుమతులే కీలకం. దేశం నుంచి ఎగుమతయ్యే సముద్ర ఉత్పత్తుల్లో మన వాటా 43% పైనే.. రాష్ట్రం నుంచి ఎగుమతుల్లోనూ రెండోస్థానం వీటిదే. ఇందులో రొయ్యలే అధికం. అందువల్ల అంతర్జాతీయంగా ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా రైతుల తలరాతలే తల్లకిందులవుతున్నాయి. ఈక్వెడార్ నుంచి పోటీ, ఇటీవల ట్రంప్ ప్రతీకార సుంకాల బాదుడు నేపథ్యంలో ధరలు పడిపోయి సాగుదారులు తీవ్రంగా నష్టపోయారు.
• 2023-24లో ఏపీ నుంచి మొత్తం ఎగుమతుల విలువ రూ. 60,524 కోట్లు. ఇందులో అమెరికా వాటా 34.52%, చైనా 19.58%, యూరోపియన్ యూనియన్ 14% ఉంది. సింహభాగం ఈ దేశాలే కొనుగోలు చేశాయి.
• మన రొయ్యకు అమెరికా పెద్ద మార్కెట్. 2023-24 సంవత్సరంలో చైనాకు 4.57లక్షల టన్నులు ఎగుమతి కాగా.. వాటి విలువ 1,449 మిలియన్ డాలర్లు.. అదే సమయంలో అమెరికాకు 3,29,192 టన్నులు ఎగుమతి చేయగా.. 2,549 మిలియన్ డాలర్ల మేర వచ్చింది. పరిమాణంలో చైనా వాటా అధికం. విలువ పరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది.
కొత్త మార్కెట్లతోనే.. రొయ్య రైతుకు ఊరట
సముద్ర ఆహార ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను సృష్టించడంలో అటు కేంద్రం, ఇటు ఎంపెడా శ్రద్ధ పెట్ట లేదు. అమెరికా అధిక ధర ఇస్తున్నా.. ఎగుమతులకు ప్రతిబంధకాలే. కొనేందుకు చైనా సిద్ధంగా ఉన్నా తక్కువ ధరే ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను వెదకాలనే ఆలోచన కొరవడింది. కేంద్రానికి వినతులు ఇచ్చినా ఫలితం లేకపోతోందనే ఆవేదన రైతులు, ఎగుమతి వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.
• రష్యాకు మొత్తం ఉత్పత్తుల్లో 10% నుంచి 20% మేర ఎగుమతులు చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు దృష్టి పెట్ట లేదు. అమెరికా సుంకాల నేపథ్యంలో భారత ఎగుమతుల సంస్థల సమాఖ్య ఇటీవల రష్యాతో చర్చలు ప్రారంభించింది.
• మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రష్యాకు 1.8% మేర మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. 2024-25లో 130 మిలియన్ డాలర్లు, 2023-24లో 155 మిలియన్ డాలర్ల విలువగల సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు అయ్యాయి. ఎగుమతిదారులు కూడా రష్యాతో వాణిజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 3వేల కంటెయినర్లను ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. అయితే అక్కడ నుంచి అనుమతులు రావడం లేదు. అక్కడి ప్రమాణాలు సాధించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
• ఆస్ట్రేలియా, సౌదీ అరేబియాల్లోనూ మన రొయ్యకు డిమాండు ఉంది. అక్కడికి ఎగుమతులపైనా కేంద్రం దృష్టి సారించాలి. రష్యా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియాకు సుమారు 8వేల కంటెయినర్లు ఎగుమతి చేయవచ్చు. ఇవి అమెరికాతో సమాన ధర ఇస్తాయనేది వ్యాపారుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విదేశీ ఎగుమతులు పెరిగేలా చేస్తేనే ఏపీ రొయ్యకు మార్కెట్ పెరుగుతుందని, రైతుకు ఊరట లభిస్తుందని అక్వా ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు.
1953 నుంచి ఎగుమతులు ప్రారంభం
మనదేశం నుంచి శీతలీకరించిన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 1953 సంవత్సరం నుంచి మొదలయ్యాయి. 2001లో వెనామీ రొయ్య (పసిఫిక్ తెల్ల రొయ్య) అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు ఎగుమతి అయ్యే వాటిలో 92% ఇవే
రాష్ట్రంలోని ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వెనామీ సాగవుతోంది
విస్తీర్ణం: 2.50లక్షల ఎకరాలు
ఉత్పత్తి: సుమారు 7లక్షల టన్నులు