సుంకాల పోటు. . వనామీకి చేటు
మార్కెట్లో వనామీ రొయ్యల ధర పతనం ఆక్వా రైతులను నష్టాల ఊబిలోకి నెడుతోంది. పంట చేతికి వస్తున్న దశలో కేజీ రూ. 210 పడిపోయింది. ఇది ఎంతమాత్రం గిట్టుబాటు కాదని సాగుదారులు వాపోతున్నారు.
బాపట్ల, న్యూస్టుడే: మార్కెట్లో వనామీ రొయ్యల ధర పతనం అక్వా రైతులను నష్టాల ఊబిలోకి నెడుతోంది. పంట చేతికి వస్తున్న దశలో కేజీ రూ. 210 పడిపోయింది. ఇది ఎంతమాత్రం గిట్టుబాటు కాదని సాగుదారులు వాపోతున్నారు. ఏప్రిల్లో అమెరికా సుంకాల ప్రభావంతో ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస ధర రూ.220 నిర్ణయించింది. నెలన్నర వ్యవధిలోనే తగ్గడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రైతులు గత మార్చి, ఏప్రిల్లో వనామీ రొయ్యల సాగు చేపట్టారు. వాతావరణ మార్పులు, రొయ్య పిల్లల్లో నాణ్యతా లోపం వల్ల వైరస్లు విజృంభించాయి. వైట్ ట్ సమస్యతో ఎదుగుదల నెమ్మదించింది. మేత తినక లూజ్ షెల్ సమస్యతో చనిపోతున్నాయి. ఇది దిగుబడులపై ప్రభావం చూపింది. ఇక కూలీల కొరతతోనూ సాగుదారులు బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో పెట్టుబడి వ్యయం గతంలో కన్నా 15 నుంచి 20 శాతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి పంట వస్తోంది. ఎక్కువగా వంద, 90, 80 కౌంట్ రొయ్యలు విక్రయిస్తున్నారు. వారం క్రితం కేజీ రూ. 225 ఉండగా ప్రస్తుతం రూ.210 పడిపోయింది. కేజీకి రూ.15 తగ్గింది. దీంతో టన్నుకు రైతు రూ.15 వేల చొప్పున నష్టపోతున్నాడు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన ధర అమలు కావటం లేదు. అమెరికా యాంటీ డంపింగ్ సుంకం 2.6 శాతం విధించటంతో ఆ ప్రభావం కంపెనీలపై పడి, ధర
పతనమైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ధర మరింత క్షీణించే ప్రమాదం ఉందని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు.
టైగర్ రొయ్యల ధర కొంత పర్వాలేదు. ప్రస్తుతం 30 కౌంట్ కేజీ రూ.550, 40 కౌంట్ కేజీకి రూ.450 చెల్లిస్తున్నారు. 20 కౌంట్ రూ.690 వరకు ఉంది. సాగుదారుల వద్ద చెరువుల్లో 20 కౌంట్ రొయ్యలు లేవు. అందరూ 35 నుంచి 45 కౌంట్ మధ్యే ఉన్నారు. ఈ ధరలూ మరో వారంలో కేజీకి రూ.50 వరకు పతనమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దీంతో టైగర్ రైతులు సైతం ఆందోళనలో ఉన్నారు.
ప్రభుత్వ జోక్యం అవసరం: వీరాస్వామి, రైతు
ప్రభుత్వం జోక్యం చేసుకుని కేజీ వనామీ రొయ్యలు వంద కౌంట్కు కనీసం రూ.230 కొనేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రైతులు రూ. లక్షల్లో నష్టపోతారు. అమెరికా యాంటీ డంపింగ్ సుంకం ప్రభావం రొయ్యల ధరపై పడకుండా కేంద్రం చూడాలి.
• జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం: 23 వేల ఎకరాలు
• వనామీ : 60 శాతం
• టైగర్ : 40 శాతం