.సాగుబడి ఇక్కడ..ఏలుబడి అక్కడ
లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి.. రాత్రీ పగలు చెరువుల వద్దే పడిగాపులు పడి.. కంటి మీద కునుకు లేకుండా ప్రతి గంటకూ భయపడుతూ రొయ్యలు పండించే రైతుల బతుకులను విదేశీ ఎగుమతులే నిర్ణయిస్తున్నాయి.
కలిదిండి, న్యూస్టుడే: లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి.. రాత్రీ పగలు చెరువుల వద్దే పడిగాపులు పడి.. కంటి మీద కునుకు లేకుండా ప్రతి గంటకూ భయపడుతూ రొయ్యలు పండించే రైతుల బతుకులను విదేశీ ఎగుమతులే నిర్ణయిస్తున్నాయి. ఏ కారణంతో ఏ సమస్య తలెత్తినా ఎగుమతులు నిలిపివేయడం.. ధరలు దిగజార్చడం పరిపాటిగా మారింది. అవకాశవాద దళారీ వ్యవస్థ దీనికి తోడు కావడంతో సాగుదారులకు దిక్కుతోచడం లేదు. మంచి రోజులెప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు.
నాడు సుంకాల పోటు.. ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రతీకార సుంకాలు విధించడంతో ఆకస్మికంగా ధరలు పడిపోయాయి. ఆ సమయంలో పట్టుబడులు చేసిన సాగుదారులు కుదేలైపోయారు. ఆ తర్వాత సుంకాలు 90 రోజులు నిలుపుదల చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినా ధరల పెరుగుదల ఆశాజనకంగా లేదు. ఒక్క రోజులో రూ.40 నుంచి రూ.60 తగ్గిన కిలో ధర తిరిగి రూ.30 పెరగడానికి 30 రోజులు పట్టింది.
నేడు యాంటీ డంపింగ్ ట్యాక్స్.. అమెరికా తాజాగా యాంటీ డంపింగ్ ట్యాక్స్ విధిస్తోంది. ప్రతీకార సుంకాల ఆటుపోట్లు నుంచి క్రమంగా బయట పడుతోన్న రొయ్యల రైతులను ఈ ట్యాక్స్ మరోసారి కుదిపేస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో కిలో ధర రూ.20 తగ్గిపోయింది. అప్పటికే 20 రోజుల్లో రెండు దఫాలుగా రూ.10 పడిపోయి అల్లాడుతున్న రైతులకు మరో రూ.20 దిగజారడంతో దిక్కుతోచలేదు. ధర పెరిగిన తర్వాత పట్టుబడి చేద్దామంటే కుదరని పరిస్థితి. మున్నెన్నడూ లేని విధంగా ఆకాశంలో వస్తోన్న మార్పుల ప్రభావంతో ఆకస్మిక పట్టుబడులు చేయాల్సి రావడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
చర్చల ఫలితం రూ.5.. యాంటీ డంపింగ్ ట్యాక్స్ కొన్ని రొయ్యల కంపెనీలకు మాత్రమే వర్తించగా.. మిగిలిన కంపెనీల్లో మూడొంతులు ట్యాక్స్ పేరిట ధరలు తగ్గించేయడంతో ఉమ్మడి జిల్లాల రొయ్యల రైతు సంఘాల నేతృత్వంలో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు జరిగిన రెండ్రోజుల తర్వాత కిలో ధర కేవలం రూ. 5 మాత్రమే పెరిగింది.
రష్యాకు ఎగుమతులు.. రొయ్యల ఎగుమతులు సింహభాగం అమెరికా, చైనా దేశాలపైనే ఆధారపడి ఉండటం వల్లే తరచూ సంక్షోభాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రష్యా, తదితర దేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించి ఎగుమతులు పెరిగితే రొయ్యల రైతులకు మంచి రోజులొచ్చినట్లే.