రొయ్యకు ఈహెచ్ పీ కాటు!
మండవల్లికి చెందిన ఓ రైతు ఐదు ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. చెరువులో 60 రోజులకు 70-80 కౌంటు రావాల్సి
ఉండగా.. ఈహెచ్ పీ సోకడంతో 220 కౌంట్ వచ్చింది.
కలిదిండి,మండవల్లి, న్యూస్టుడే: మండవల్లికి చెందిన ఓ రైతు ఐదు ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. చెరువులో 60 రోజులకు 70-80 కౌంటు రావాల్సి ఉండగా.. ఈహెచ్ పీసోకడంతో 220 కౌంట్ వచ్చింది. రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు కేవలం రూ.2.40 లక్షలుచేతికొచ్చాయి.
పిల్లల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువ.. రొయ్య పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన హేచరీలు నామమాత్రంగానే ఉన్నాయి. ప్రైవేటు హేచరీల నుంచి నాణ్యమైన రొయ్య పిల్ల లభించడం లేదు. దీంతో రైతులు దూర ప్రాంతాల నుంచి గుర్తింపు పొందిన హేచరీ నుంచి రొయ్య పిల్లలు తీసుకొస్తున్నారు. వ్యాధి లక్షణాలు లేని పిల్ల వేస్తున్నా.. చెరువులో వేసిన తరువాత వ్యాధి బారిన పడుతోంది.
నష్టం ఇలా.. ఈ హెచ్పీ రొయ్య హెపటో పాంక్రియానిస్లో చేరి జీర్ణ కోశాన్ని కబళిస్తోంది. రొయ్య జీర్ణించుకునే పోషకాలను పీల్చుకుని జీవిస్తుంది. దీనివల్ల రొయ్యల్లో సరైన ఎదుగుదల ఉండదు. పరిమాణంలో హెచ్చుతగ్గులుంటాయి. ఆశించిన కౌంటు రాదు. రొయ్యలు రంగు మారి పోతాయి. రొయ్యల సాగులో కొన్ని రోజులుగా ఈహెచ్పీ (ఎంటరోసైటోజూన్ హెపాటో పెనె) వ్యాధి రైతులను నష్టాల బాట పట్టిస్తోంది. దీనిని గుర్తించడానికి రైతులు పత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా నివారణ సాధ్యపడటం లేదు. లోపం ఎక్కడుందో పసి గట్టలేక.. అవస్థలు ఎదుర్కొంటున్నారు.
చెరువులో.. రొయ్య పిల్లతో పాటు చెరువులోనూ ఈ వ్యాధి లక్షణాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. చెరువులను పూర్తి స్థాయిలో శుభ్రపరచాలి. బాగా ఎండ గట్టి.. బ్లీచింగ్ చల్లాలి. సున్నాన్ని ఎక్కువ మోతాదులో చల్లి పీహెచ్ స్థాయిని పెంచాల్సి ఉంటుంది. అన్ని దిక్కుల నుంచి మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్ లో పరీక్షించాలి. అదే విధంగా నీటి పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. పిల్ల ఎంపిక.. సంఖ్యకు ప్రాధాన్యం.. ఎకరాకు 30-40 వేలు వరకు రొయ్య పిల్ల వేయడం మంచిది. గరిష్ఠంగా 50 వేలు వరకు వేయవచ్చు. ఎక్కువ మంది ఒక లక్ష వరకు వేస్తున్నారు. ఆ మేరకు మేత వేయడంతో రొయ్యలు తినగా మిగిలింది చెరువు అడుగు భాగంలోకి దిగి కలుషితంగా మారుతోంది. 'యాజమాన్య పద్ధతులు, నిబంధనలు పాటించడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చు' అని మత్స్యశాఖ జిల్లా అధికారి బి. నరసయ్య సూచించారు.
ఉమ్మడి జిల్లాలో (లక్షల ఎకరాల్లో..) ఆక్వా సాగు : 2.90
రొయ్యలు : 1.10
చేపలు : 1.80