For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్య.. ఎంత మేపినా ఎదగదేమయ్యా!

img

రొయ్య.. ఎంత మేపినా ఎదగదేమయ్యా!
డాలర్ పంటగా పేరొందిన ఆక్వాను వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. తొలుత రొయ్యకు వైరస్ల దాడి పెరిగింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపుతో ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం కలుగజేసుకోవడంతో సాగుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

టంగుటూరు, న్యూస్టుడే: డాలర్ పంటగా పేరొందిన ఆక్వాను వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. తొలుత రొయ్యకు వైరస్ల దాడి పెరిగింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపుతో ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం కలుగజేసుకోవడంతో సాగుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో.. తాజాగా మరో కొత్త చిక్కొచ్చి పడింది. ఎంత మేత తిన్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టైగర్ రొయ్య ఆశించినంతగా ఎదగడం లేదు.
ఇప్పటికే వనామీని వదిలేశారు: జిల్లాలో తీర ప్రాంత మండలాలైన టంగుటూరు, కొత్తపట్నం, సింగరాయకొండ, ఒంగోలు, మద్దిపాడుల్లో గత ముప్ఫై ఏళ్లుగా రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. సముద్ర తీరం వెంట, ఇతర పట్టా భూములతో కలిపి జిల్లాలో వ్యాప్తంగా మొత్తం 2,910 హెక్టార్లలో రొయ్యను పండిస్తున్నారు. గత అయిదేళ్లుగా వైరస్ల బెడద అధికం కావడం, ధరలు ఆశాజనకంగా లేకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి కారణాలతో వనామీ రకాన్ని చాలా వరకు రైతులు ఇప్పటికే వదిలేశారు.
సగానికి సగం పడిపోయిన బరువు: ఈ ఏడాది ఆక్వా సాగుకు వాతావరణం సానుకూలంగా ఉండటం.. టైగర్కు మంచి ధరలు లభిస్తుండటంతో ఎక్కువ మంది ఆ రకాన్నే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువుల్లో 40 నుంచి 60 రోజుల పంట కొనసాగుతోంది. సాధారణంగా 60 రోజుల రొయ్య 10 నుంచి 12 గ్రాముల బరువు తూగాలి. కానీ చెరువుల్లో ఆ పరిస్థితి లేదు. కేవలం 5 నుంచి 6 గ్రాములు మాత్రమే తూగుతోంది. దీంతో దిగుబడి సగానికి పైగా పడిపోతోంది. కంపెనీ మేతనే నిత్యం అందిస్తున్నామని, అయినా రొయ్య బరువు పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా పరిస్థితులతో రైతుల ఆందోళన: జిల్లాలో ఆక్వా సాగు ఏళ్ల తరబడిగా ఉన్నప్పటికీ.. రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రం ఒక్కటీ లేదు. పుదుచ్చేరి, నెల్లూరు వంటి ప్రాంతాలకు వెళ్లి సీడ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎకరాకు ప్రస్తుతం టైగర్ రకం పిల్లలను 50 వేల నుంచి లక్ష వరకు వేస్తున్నారు. గత ఏడాది ఓ కంపెనీకి చెందిన సీడ్ కారణంగా ఎదుగుదల లోపంతో సాగుదారులు తీవ్రంగా నష్టపోయారు. తాజా పరిస్థితులతో మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి సీహెచ్. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆక్వా సాగులో సమస్యలను రైతులు తమ దృష్టికి తీసుకురాలేదని అన్నారు. ఇటీవల టంగుటూరు మండలం వెలగపూడిలో చెరువులను పరిశీలించామని చెప్పారు. సమస్యను దృష్టికి తెస్తే పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు.

Languages

Shares

Related News