నష్టాలతో రొయ్య రైతు విలవిల
ఇన్నాళ్లూ డాలర్ల వర్షం కురిపించిన రొయ్య రైతుకు సమస్యలు చుట్టుముడుతున్నాయి. అమెరికా సుంకాల దెబ్బకు కుదేలై కొంతకాలం ఇబ్బందిపడ్డారు. పరిస్థితులు కుదుటపడి ధర పెరిగి ఊపిరి పీల్చుకుంటున్న ఈ తరుణంలో వైరస్ తాకిడి, నాసిరకపు మేతతో రొయ్య పిల్లల్లో ఎదుగుదల లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులు వనామీ రకం రొయ్యలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో రొయ్యలను పెంచుతున్నారు. అధికారికంగా ఉన్నది 3 వేల ఎకరా లే అయినా అనధికారికంగా మరో వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. అమెరికా సుంకాల దెబ్బకు ధర తగ్గడంతో నష్టాల బాట పట్టారు. ప్రస్తుతం ధర ఆశాజనకంగా ఉండటంతో ఊరట చెందారు. ఈ సమయంలో వనామీ రకం రొయ్యపై ఈహెచ్పీ (ఎంట్రో సైటోజూన్ హెపాటోపినై) వైరస్ ఆశిస్తోంది. దీంతో రొయ్య ఎదుగుదల గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో 100 నుంచి 110 రోజులకు 40 కౌంట్కు రొయ్య ఎదగగా.. వైరస్ దెబ్బకు 130 రోజులు దాటుతోంది. దీనివల్ల వ్యయం పెరుగుతోంది. మేత కోసం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. చెరువుల్లో రొయ్య 60 రోజులకు 10 నుంచి 12 గ్రాముల బరువుకు చేరాలి. ప్రస్తుతం 5 గ్రాముల బరువే ఉన్నాయి.
నాసిరకం మేతతోనూ..
ఎకరాకు లక్షన్నర వరకు సీడ్ వేస్తుంటారు. కొంతమంది సగటున 2 లక్షలు వేసిన
సందర్భాలున్నాయి. మొదటి నెల దాటిన తర్వాత రోజుకు నాలుగు సార్లు మేత వేయాలి. ఈ నేపథ్యంలో రోజుకు 70 కేజీల మేత వేయాలి. వంద రోజులకు రొయ్య ఎదిగి పట్టుబడికి రావాలి. అలా అయితేనే రైతుకు లాభాలు వస్తాయి. టన్ను మేతకు రూ. 10 వేల వరకు వెచ్చించాలి. కొంతమంది నాసిరకం మేతను అంటగట్టడంతో రొయ్య ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. ఒక వైపు ఈహెచ్పీ వైరస్.. మరోవైపు నాసిరకం మేత పుణ్యమాని రొయ్య సకాలంలో అనుకున్న బరువుకు చేరడం లేదు. ఫలితంగా అదనంగా మరో 30 రోజులు వీటిని పెంచాల్సి వస్తోంది. దీనివల్ల మేత కోసం మరో రూ.1.5 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది.
జిల్లాలో ఆక్వాసాగు: 3 వేల ఎకరాలు
రైతులు: 380
వైరస్లో నష్టం.. ఈ హెచ్పీ వైరస్లో రొయ్యలకు నష్టం వాటిల్లుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. సకాలంలో రొయ్య సైజు పెరగాలంటే నాణ్యమైన మేతను
వినియోగించాలి. నిపుణుల సూచనలు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు.
- ప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి