ధర పడిపోతాంది..!
రొయ్య ధర నానాటికీ పడిపోతోంది. ట్రంప్ సుంకాల ప్రకటనతో దిగజారిన ధరలు నేటికీ స్థిరపడలేదు. ఓ వైపు వాతావరణం.. ఇంకో వైపు వ్యాధుల బెడదతో బెంబేలెత్తుతున్న సాగు దారులకు దిగజారుతున్న ధరలు దడ పుట్టిస్తున్నాయి
కలిదిండి, న్యూస్టుడే: రొయ్య ధర నానాటికీ పడిపోతోంది. ట్రంప్ సుంకాల ప్రకటనతో దిగజారిన ధరలు నేటికీ స్థిరపడలేదు. ఓ వైపు వాతావరణం.. ఇంకో వైపు వ్యాధుల బెడదతో బెంబేలెత్తుతున్న సాగు దారులకు దిగజారుతున్న ధరలు దడ పుట్టిస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో 100 కౌంటు ధర రెండు దఫాలుగా రూ.10 తగ్గిపోయింది. ఇది మరింత కిందకు దిగితే.. భారీ నష్టాలు తప్పవంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.
కదలని ధర.. అమెరికా సుంకాల ప్రకటనకు ముందు రూ.260 వరకు పలికిన 100 కౌంటు ధర అతివేగంగా రూ.190-200కు పడిపోయింది. సుంకాల నిలుపుదల తర్వాత తిరిగి రూ.230కి చేరడానికి నెలలు పట్టింది. ఆ మాత్రం ధర ఉంటే తక్కువ నష్టాలతో బయట పడొచ్చనే ధీమాతో రైతులు ముందుకు సాగారు. ఇంతలో నిలకడ వాతావరణంతో ఆకస్మిక పట్టుబడులు చేయాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో మధ్యవర్తులు పట్టికలో ఉన్న ధర కంటే రూ.5-10 వరకు తగ్గించి కొనుగోలు చేయడంతో గత్యంతరం లేక అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
చెరువులు ఖాళీ.. మే నెల అంతా ఎడతెరిపి లేని వర్షాలు ఆక్వాను వణికించాయి. జూన్ నెల ఆరంభంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. వాతావరణంలో ఈ విపరీత ధోరణి రైతులకు అంతుచిక్కడం లేదు. నిలకడ లేని వాతావరణంతో ఏ క్షణమైనా పట్టుబడి పట్టడానికి సిద్ధంగా ఉండాల్సి పరిస్థితి నెలకొంది. నెల రోజుల వ్యవధిలో దాదాపు 40 శాతం చెరువులు ఖాళీ
అయిపోయాయి. దిగజారుతున్న ధరల్లో పట్టుబడి పట్టాల్సి వస్తే.. నష్టాల నుంచి కోలుకోలేమంటూ సాగుదారులు ఆవేదన చెందుతున్నారు.
20 రోజుల్లో రూ.10 కోత.. రూ.230 ధర కాస్తా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మే తొలి వారంతో 100 కౌంటు ధర రూ.230 ఉండగా.. మూడో వారంలోకి రాగానే రూ.225కి
పడిపోయింది. జూన్ ఒకటో తేదీకి మరో రూ.5 తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ఏమి చేయాలో తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.